Satya Nadella : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల (Satya Nadella) తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి బంజారాహిల్స్లోని సత్య నాదెళ్ల నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ (Skill University ) గురించి ఆయనతో చర్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచీ మైక్రోసాఫ్ట్కు సానుకూలంగా ఉంది. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సెంటర్లో సుమారు 4 వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల ఒప్పందాలు జరిగాయి. దీనికి సంబంధించిన పురోగతిపైనా సత్యనాదెళ్లతో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో ప్రధాన భాగస్వామి కావాలని ఆయన్ను కోరేందుకు ప్రధానంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్యూచర్ సిటీ, ఏఐ సిటీల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ (Microsoft) కీలక పాత్ర పోషించాలనే కోరే అవకాశముంది. క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.