Revanth Reddy: మెస్సీతో మ్యాచ్ కు సిద్ధమంటున్న రేవంత్ రెడ్డి…!
డిసెంబర్ 13.. ఇప్పుడీ రోజు కోసం యావత్ తెలంగాణ ఆతృతగా ఎదురుచూస్తోంది. ఎప్పుడు డిసెంబర్ 13 వస్తుందా అని సామాన్యుడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరకూ ఒకటే వెయిటింగ్. ఎందుకంటే ఆరోజు.. హైదరాబాద్ కు అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ వస్తున్నాడు. రావడమే కాదు.. ఉప్పల్ స్టేడియంలో ఓ ఫ్లెండ్లీ మ్యాచ్ లో పార్టిసిపేట్ కూడా చేస్తున్నాడు. అయితే ఇందులో మరో ప్రత్యేకమైన విషయం ఉంది. ఈ మ్యాచ్ లో మెస్సీ టీమ్ ను.. సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఎదుర్కోనుంది. దీనికోసం ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ బూట్లు తొడిగి మైదానంలో కసరత్తులు మొదలుపెట్టారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీమ్ తో జరగనున్న మ్యాచ్ కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి గంట పాటు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ సెషన్లో ఆయన బాల్ను డ్రిబ్లింగ్ చేస్తూ, పాసింగ్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ మ్యాచ్లో మెస్సీ తన ట్రేడ్మార్క్ 10వ నంబర్ జెర్సీతో ఆడనుండగా, సీఎం రేవంత్ రెడ్డి 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ ద్వారా రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని పెంచడంతో పాటు, యువతను ఫుట్బాల్ వైపు ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం స్వయంగా క్రీడల్లో పాల్గొనడంపై సోషల్ మీడియాలో “సూపర్ సీఎం” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ కీర్తిని ప్రపంచ క్రీడాపటంలో మరింత పెంచుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






