తెలంగాణలో భారీ పెట్టుబడి.. రూ.6,200 కోట్లతో డేటా సెంటర్
సింగపూర్కు చెందిన అంతర్జాతీయ స్థిరాస్థి సంస్థ క్యాపిటల్యాండ్ తెలంగాణలో రూ.6,200 కోట్ల పెట్టుబడులతో డేటా కేంద్రం నెలకొల్పనుంది. హైదరాబాద్లోని మాదాపూర్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా 5 వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమక్షంలో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్టు (క్లింట్) తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, క్యాపిటల్యాండ్ భారత విభాగం సీఈఓ సంజీవ్ దాస్గుప్తా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సంజీవ్ దాస్గుప్తా మాట్లాడుతూ సింగపూర్ కేంద్రంగా 22 ఏళ్ల క్రితం ఏర్పాటైన క్యాపిటల్యాండ్ సంస్థ ద్వారా 30 దేశాల్లోని 260 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం.
ఆసియా, యూరప్లలో 25 డేటా కేంద్రాల ద్వారా కొన్నేళ్లుగా డేటా సెంటర్ డిజైన్, అభివృద్ధి, నిర్వహణలో మిగతావారి కంటే ముందున్నాం. ఇప్పటికే దేశంలో ఒక డేటా కేంద్రం నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరణ ప్రణాళికలో భాగంగా భారత్లోనే అతిపెద్ద డేటా కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం. పదేళ్ల క్రితం హైదరాబాద్ మార్కెట్ లో అడుగుపెట్టాం. సైబర్ పెర్ల్, ఎవాన్స్, ఐటీపీ హెచ్ పార్కుల్లో మౌళిక వసతుల ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాం. దాదాపు 30.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 70 సంస్థలు నడుస్తుండగా 30 వేల మంది నిపుణులు పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రోత్సహకాలు పెట్టుబడులకు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత ఆదనపు ఆకర్ణణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్లో ఏర్పాటు చేసే డేటా కేంద్రం ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ సేవలందిస్తాం. ఇది అయిదేళ్లలో అందుబాటులోకి వస్తుందని అని తెలిపారు.






