తెలంగాణలో క్యాపిటాలాండ్ పెట్టుబడులు
తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు క్యాపిటాలాండ్ కంపెనీ ముందుకు వచ్చింది. 6,200 కోట్ల రూపాయలతో తన పెట్టుబడి ప్రణాళికలను కంపెనీ మంగళవారం ప్రకటించింది. 6,200 కోట్ల రూపాయల పెట్టుబడిలో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్న తన కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.1,200 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ మాదాపూర్లోని క్లైంట్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగి ఉండే ఈ డేటా సెంటర్ 5 సంవత్సరాల తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తమకున్న సుమారు 6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ విస్తీర్ణాన్ని రెట్టింపు చేసేందుకు రానున్న ఐదు సంవత్సరాలలో మరో 5 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.






