తెలంగాణలో విలీనం పాలిటిక్స్..

తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా విలీనం మాటలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి .. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పక్కాగా, అదేపనిగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఏయే పదవులు వరిస్తాయన్నది కూడా జోస్యం వినిపిస్తున్నారు. దీంతో ఇది ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవం వెరసి.. గులాబీ దళంలో ఆందోళనలు నెలకొంటున్నాయి.
గతేడాది నవంబర్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశాన్ని నాటి పీసీసీ చీఫ్గా సీఎం రేవంత్రెడ్డి తెరపైకి తెచ్చారు. ఎన్నికల తర్వాత రెండూ విలీనం అవుతాయని, అందు కోసం ఢిల్లీ లిక్కర్ కేసులో కీలకమైన కవితను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. ఈవిషయాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ గెలుపునకు ఈ అంశం చాలా దోహదం చేసింది. ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్, బీజేపీని కలిపి ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టారు రేవంత్. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా తాను పార్టీ మారడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్… బీజేపీలో విలీన ప్రతిపాదన తేవడమే అని ఆరోపించారు.దీంతో విలీన ప్రచారం మరింత పెరిగింది.
బీఆర్ఎస్ నాయకులు ఇది అబద్దపు ప్రచారమని ఎంత కొట్టి పారేసినా.. ఈ ప్రచారానికి తెర పడడం లేదు. బీఆర్ఎస్, బీజేపీ విలీన అంశం కొలిక్కి వస్తోందన్నారు రేవంత్. విలీనం జరిగితే ఎవరికి ఏయే పదవులు ఇవ్వాలన్న విషయమై రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని సీఎం రెండు పార్టీలను ఇరికించేశారు. విలీనం పూర్తయితే కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్రంలో మంత్రి పదవి, కేసీఆర్ కూతురు కవితకు రాజ్య సభ ఎంపీ పదవి ఇచ్చేందుకు కూడా ఒప్పందం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ విలీన అంశం మరోమారు చర్చనీయాంశమైంది.
బీఆర్ఎస్ నాశనాన్ని కోరుకుంటున్న వారు.. ఈరకమైన ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను. కవిత అన్నను.ఇ వ్వాళ్టికి మా ఇంటి ఆడబిడ్డ జైల్లో ఉండబట్టి 150 రోజులు. నేను ఢిల్లీకి వెళ్లి లాయర్లతో బెయిల్ కోసం మాట్లాడొద్దా. కవితకు ధైర్యం చెప్పొద్దా. ఏమన్న అంటే బీజేపీ కాళ్లు మొక్కిండు, లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేస్తున్నారు. మాకు వాళ్లతో ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ 150 రోజులు జైల్లో ఉండేదా..? ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైల్లో ఉన్నారా..? మా పార్టీ మాయం కావాలని కోరుకునే వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ 24 ఏళ్లు పార్టీ విజయవంతంగా కొనసాగింది. మరో 50 ఏళ్లు కొనసాగేలా బలంగా తయారు చేసుకున్నం’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
అంతే కాదు…సీఎం రేవంత్రెడ్డి త్వరలోనే తన బృందంతో కలిసి బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రేవంత్ తదుపరి రాజకీయ మజిలీ బీజేపీతోనేనని చెప్పారు. ముఖ్యమంత్రే పార్టీ మారి.. కొత్త చరిత్రకు నాంది పలుకుతారేమోనన్నారు. తాను పుట్టింది బీజేపీలోనే.. చివరి రాజకీయ ప్రస్థానం కూడా బీజేపీతోనే ముగుస్తుందంటూ ప్రధాని మోడీతో, అమిత్షాతో రేవంత్ చెప్పారని తెలిపారు. కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని, అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పినమాట వాస్తవమో, కాదో రేవంత్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్కు బీటలు.. పార్లమెంటు ఎన్నికల పలితాల తర్వాత బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ బాట పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు వరసకట్టి ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తోందని, అసలు బీఆర్ఎస్ శాసన సభాపక్షం లేకుండా పోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని అడ్డుకోలేకపోవడం, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం కావడం.. అయిదు నెలలుగా కవితకు బెయిల్ రాకపోవడం వంటి కారణాలతో.. బీఆర్ఎస్ పని అయిపోయిందనే పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతోందంటూ వార్తలు వెలువడ్డాయి.