Hydra: జానారెడ్డి, బాలకృష్ణకు నోటీసులు!

చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుంది. ప్రముఖులకు ఒకలా, సామాన్యులకు ఇంకొకలా ఉండదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేసిన ప్రకటన ఆచరించి చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన రెండు సంఘటనలు దీనిని ధవృవీకరిస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) విషయంలో ప్రభుత్వ తీరును చూసి ఆశ్చర్యపడ్డ జనానికి ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna), కాంగ్రెస్ దిగ్గ నేత జానారెడ్డి (Jana Reddy) ఇళ్లు సహా పలువురు వీఐపీల ఇళ్లలో కొంత భాగం తొలగించేందుకు ప్రభుత్వం మార్కింగ్ చేయడం చర్చనీయాంశమైంది.
భాగ్యనగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ ఉన్న జూబ్లీహిల్స్ చెక్పోస్టు రోడ్డు అనే విషయం తెలిసిందే. ప్రముఖుల నివాసాలు, నగరంలోని కీలక ప్రాంతాలన్నీ ఈ పార్కు చుట్టూనే ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ రోడ్డును విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రహదారి నుంచి విస్తరణ చేపట్టనున్న పరిధి వరకు మార్కింగ్ చేపట్టారు.
కాగా, ఈ మార్కింగ్లో కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 86 ఆస్తులకు ప్రభుత్వ మార్కింగ్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ మార్కింగ్ వరకు ఉన్న నిర్మాణాల్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్కింగ్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం కూడా ఉండడంతో చర్చనీయాంశమవుతోంది. రోడ్ నంబర్ 45లోని బాలకృష్ణ నివాసం లోపల దాదాపు 6 అడుగుల మేర మార్కింగ్ చేశారు. అలాగే కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికీ ఈ రోడ్డు వెడల్పు ఎఫెక్ట్ తగిలింది. ఆయన ఇంటి ముందు ఉన్న ప్రవారీ గోడ సైతం బల్దియా అధికారులు చేసిన మార్కింగ్ లోపల ఉంది. ఈ మేరకు ఆయా నేతలకు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.