Kavitha: సీఎం రేవంత్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలి : కవిత
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ ధనంతో పట్టణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తూ, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదినిని (Rani Kumidini) ఎస్ఈసీ కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తాము చూపిన రుజువుల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) సమావేశాలు ప్రజాధనంతో కాకుండా, సొంత నిధులతో నిర్వహించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కొనసాగుతున్న సీఎం టూర్లను నిలిపివేయాలని, లేదా కఠినమైన ఆంక్షలు విధించాలని ఎస్ఈసీని కోరామని తెలిపారు.






