Womens Kabaddi : ప్రపంచ విజేతలు..మన బంగారు రాణులు
ప్రపంచ కబడ్డీలో భారత్ (India) ఆధిపత్యానికి తిరుగులేదు. మనవాళ్లు కూతపెడితే.. ప్రత్యర్థి గుండెలదరాల్సిందే.. మనవాళ్లు రైడ్ చేస్తే పాయింట్లు పడాల్సిందే. అది మరోసారి నిరూపితమైంది.
వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది భారత్ మహిళల కబడ్డీ జట్టు.ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్లో చైనీస్ తైపీ జట్టుపై భారత్ 35–28 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుని కబడ్డీ క్రీడలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఈ టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు అద్భుత ఫామ్ను కొనసాగించింది. తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్కు చేరుకుంది. సెమీస్లో ఇరాన్పై 33–21 తేడాతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు, చైనీస్ తైపీ కూడా తమ గ్రూపులో అజేయంగా నిలిచి, సెమీస్లో బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు చేరింది.
ఈ ఏడాది భారత్ సాధించిన రెండో పెద్ద విజయమిది. ఈ మార్చిలో ఆసియా ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది. ప్రపంచకప్ గెలిచిన కబడ్డీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘‘ప్రపంచకప్ గెలిచి దేశం గర్వించేలా చేసిన భారత కబడ్డీ జట్టుకు అభినందనలు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టునూ మోదీ ప్రశంసించారు. ‘‘సమష్టి కృషి.. దృఢ సంకల్పానికి ఈ విజయం మంచి ఉదాహరణ. జట్టులో ప్రతి ఒక్క క్రీడాకారిణి ఓ ఛాంపియనే’’ అని ప్రధాని అన్నారు.
“భారత మహిళల జట్టు ప్రపంచకప్ను నిలబెట్టుకోవడం గర్వకారణం. ఫైనల్ వరకు వారి ఆధిపత్యం చూస్తే, గత కొన్నేళ్లుగా మహిళల కబడ్డీ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది. బంగ్లాదేశ్లో ఈ టోర్నీ జరగడం కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం” అని వివరించారు పుణెరి పల్టన్ హెడ్ కోచ్ అజయ్ ఠాకూర్. ఈ టోర్నమెంట్లో మొత్తం 11 దేశాలు పాల్గొనడం విశేషం.
ఈ విజయంపై హర్యానా స్టీలర్స్ హెడ్ కోచ్ మన్ప్రీత్ సింగ్ స్పందిస్తూ, “మహిళల జట్టు దేశం గర్వపడే ప్రదర్శన ఇచ్చింది. వారి ఆత్మవిశ్వాసం, జట్టుగా ఆడిన తీరు అద్భుతం. ఒక మాజీ క్రీడాకారుడిగా, ఈ స్థాయికి చేరుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. క్రీడాకారులకు, సిబ్బందికి నా అభినందనలు” అని తెలిపారు.






