మతవాదుల చేతుల్లో బంగ్లా నూతన సర్కార్..?
బంగ్లాదేశ్ నూతన సర్కార్… దేశంపై పట్టుకోల్పోతోందా…? నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్.. అక్కడి పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా మారుతున్నారా..? ఇప్పటికీ ఆదేశంలో నిరసనలు సద్దుమణగడం లేదా..? యూనిస్ ప్రకటనలను మైనార్టీ సమాజం నమ్మడం లేదా..? ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే అదే అర్థం ధ్వనిస్తోంది. మైనార్టీల ఆందోళనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించడంతో.. కొద్దిరోజులు వ్యూహాత్మకంగా వ్యవహరించింది బంగ్లా మధ్యంతర ప్రభుత్వం. ఢాకేశ్వరి ఆలయాన్ని సందర్శించడం.. వారితో మాట్లాడడం చేసింది.
అయితే.. బంగ్లాదేశ్ లో హిందూ సమాజంపై దాడులు మాత్రం ఆగడం లేదు. సరికదా విస్తరిస్తున్నాయి. బంగ్లాదేశ్లో నెల క్రితం.. రిజర్వేషన్ల అంశంపై షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి యువత దేశంలో అరాచకం సృష్టించింది. ఏకంగా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయేలా చేశారు.ఇక అల్లరి మూకలు దేశం మొత్తం విధ్వంసం సృష్టించారు. సైనికులు, పోలీసులు చూస్తూ ఊరుకుండిపోయారు. ఇక ఇదే సమయంలో బంగ్లాదేశ్లోని హిందూ ఆలయాలను ధ్వసం చేశారు. హిందువులపై దాడుల చేశారు.
ఈ అల్లర్లలో వందల మంది చనిపోయారు. అల్లరి మూకలు కోరుకున్న హసీనా ప్రభుత్వం ఓడిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయినా హిందూ ఉద్యోగులపై దాడులు కొనసాగుతున్నాయి. హిందూ ఉపాధ్యాయులు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేయవలసి వస్తోంది. నిరసనకారులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చి నినాదాలు చేస్తూ హిందూ ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని కోరుతూ వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో 50 మంది హిందూ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టారు.
బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు విద్యార్థులు బరిషల్లోని బకరంజ్ ప్రభుత్వ కళాశాలప్రిన్సిపాల్ శుక్లా రాణి హల్డర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె కొద్దిసేపు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ఖాళీ కాగితంపై నేను రాజీనామా చేస్తున్నాను అని అని రాసి, వారికి ఇచ్చారు. ఆగస్టు 18న అజింపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాలకు చెందిన 50 మంది బాలికలు ప్రిన్సిపాల్ గీతాంజలి బారువా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గౌతమ్ చంద్ర పాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ షహనాజా అక్తర్లను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో ఉపాధ్యాయులను విద్యార్థులు చుట్టుముట్టడం, రాజీనామా లేఖలపై బలవంతంగా సంతకం చేయించడం కనిపిస్తుంది. ఆ సమయంలో బంగ్లాదేశ్కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ మైనారిటీ హిందువులకు మద్దతుగా మాట్లాడారు. బంగ్లాదేశ్ లోని ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని యన ఆరోపించారు. తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ఈ అంశంపై స్పందించడం లేదన్నారు.






