లంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య..
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమర సూర్య(Harini Amarasuriya) ప్రమాణ స్వీకారం చేశారు.నేషనల్ పీపుల్స్ పవర్(NPP) సోషలిస్ట్ రాజకీయ కూటమికి చెందిన 54 ఏళ్ల హరిణి అమరసూర్యతో ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శ్రీలంక లో దిస నాయకేతో పాటు మొత్తం నలుగురితో ప్రభుత్వం కొలువుదీరింది.నూతన ప్రధానిగా పదవి చేపట్టిన హరిణి అమరసూర్యకు పలు శాఖలను అప్పగించారు. వాటిలో విద్య, న్యాయ శాఖ, కార్మిక, శాస్త్ర సాంకేతిక శాఖ, పరిశ్రమలు, పెట్టుబడులు, ఆరోగ్య శాఖలు ఉన్నాయి.
మరోవైపు…అధికార మార్పిడిలో భాగంగా.. శ్రీలంక ప్రధానిగా ఉన్న దినేష్ గుణ వర్ధన తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక ఓపెన్ యూనివర్సిటీలోని సోషల్ స్టడీస్ విభాగంలో సీనియర్ లెక్చరర్, మానవ హక్కుల కార్యకర్త అయిన హరిణి అమరసూర్య.. 2020 నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు.తాజాగా ప్రధాన మంత్రి హోదాలో విద్య, న్యాయ శాఖ, కార్మిక, శాస్త్ర సాంకేతిక శాఖ సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను ఆమె నిర్వహించనున్నారు.
అయితే లిబరల్ భావజాలం కలిగిన ఆమె.. లింగ అసమానతలు, శిశు సంరక్షణ, నిరుద్యోగం, దేశ విద్యావ్యవస్థలో లోపాలు వంటి కీలక అంశాలపై పరిశోధన చేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. సిరిమావో బండారు నాయకే(1994-2000), చంద్రిక కుమారతుంగ(ఆగస్టు 19,1994-నవంబర్ 12,1994) తర్వాత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన మూడో మహిళా నేతగా, 16 వ ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య చరిత్ర తిరగరాశారు.






