మానవాళిపై అణ్వస్త్ర భూతం
అణ్వస్త్రాలు.. ఒకదేశం బలానికి, రక్షణ పాటవానికి ప్రతీకలు. అందుకే చాలా దేశాలు అణ్వస్త్రాలు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ రేసులో ఇప్పటివరకూ అమెరికా, రష్యా ముందువరుసలో ఉన్నాయి. ఈ అగ్రదేశాలు రెండూ.. 5 వేలకు పైగా అణ్వస్త్రాలను తమ రక్షణ వ్యవస్థలో ఉంచుకున్నాయి. వీటికితోడు మరికొన్ని దేశాలు సైతం.. అణ్వాయుధ రేసులో పరుగులెడుతున్నాయి. ఆ వరుసలో ముందంజలో ఉంది కమ్యూనిస్టు చైనా…ఈ దేశం శరవేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటోందని ప్రముఖ అంతర్జాతీయ మేధోసంస్థ ‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ రక్షణ కోసం పూర్తిగా అణ్వస్త్రాలనే నమ్ముకున్నాయని ‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతోందని పేర్కొంది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతం ఎగబాకిందని తెలిపింది. ఈమేరకు వార్షిక ‘సిప్రి ఇయర్ బుక్ 2024’ను విడుదల చేసింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న తొమ్మిది దేశాలు తమ ఆయుధాలను మరింత ఆధునికీకరిస్తున్నాయని సిప్రి వెల్లడించింది.
కొన్ని దేశాలు 2023లో కొత్త ఆయుధ వ్యవస్థలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచాయని పేర్కొంది. మొత్తంగా 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయని తెలిపింది. వీటిలో 9,585 ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో ఉన్నట్లు వెల్లడించింది. ఇవన్నీ వినియోగానికి అందుబాటులో ఉన్నట్లే. దాదాపు 3,904 అస్త్రాలు క్షిపణులు, యుద్ధ విమానాల్లో అమర్చి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 60 వరకు పెరిగింది. వీటిలో దాదాపు 2,100 ఆయుధాలను ఏ క్షణమైనా ప్రయోగించేలా అత్యంత అప్రమత్తతతో ఉంచినట్లు నివేదిక స్పష్టం చేసింది. అవన్నీ రష్యా, అమెరికాకు చెందినవేనని తెలిపింది. తొలిసారి చైనా సైతం అణ్వస్త్రాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచడం గమనించామని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణ్వస్త్రాల్లో 90 శాతం రష్యా, అమెరికాకు చెందినవేనని సిప్రి నివేదిక వెల్లడించింది. 2023లో ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదని స్పష్టం చేసింది. అయితే, రష్యా మాత్రం ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన అణ్వాయుధాల సంఖ్యను పెంచుకున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలో చైనా అత్యంత వేగంగా తమ అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంటోందని సిప్రి కీలక అధికారి హాన్స్ క్రిస్టెన్సెన్ తెలిపారు. ఆ దేశం వద్ద 2023లో 410 ఆయుధాలు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 500 వరకు చేరినట్లు పేర్కొన్నారు. ఈ దశాబ్దం చివరకు చైనా తమ ఖండాంతర క్షిపణుల సంఖ్యను అమెరికా లేదా రష్యాకు సమానంగా పెంచుకుంటుందని అంచనా వేశారు.
గత ఏడాదిలో భారత్ చాలా స్వల్ప స్థాయిలో అణ్వాయుధాలను పెంచుకున్నట్లు సిప్రి తెలిపింది. భారత్, పాకిస్థాన్ ఇరు దేశాలు కొత్త అణ్వస్త్ర ప్రయోగ వ్యవస్థల అభివృద్ధిని కొనసాగించాయని పేర్కొంది. పాక్ ప్రధానంగా భారత్ను నిలువరించేందుకు వీలుగా అణ్వస్త్ర విధానాన్ని కొనసాగిస్తోందని తెలిపింది. భారత్ మాత్రం చైనాలో ఏ మూలకైనా ప్రయోగించగల ఆయుధాలపై దృష్టి సారించిందని పేర్కొంది. హమాస్తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఆధునికీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. డిమోనాలో ఉన్న ప్లుటోనియం ఆధారిత రియాక్టర్ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఎప్పుడూ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించలేదు.






