అదానీ, మాధబిపై హిండెన్ బర్గ్ ఆరోపణలు.. కేంద్రం తీరుపై విపక్షాల ఆగ్రహం

విదేశాల్లోని అదానీ గ్రూప్లో సెబీ చైర్మన్ మాధవి బుచ్ అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిండెన్బర్గ్ సంస్థ చేసిన ఆరోపణలు.. దేశ రాజకీయాలను వేడెక్కించాయి. సెబీ చైర్ పర్సన్గా కొనసాగుతూనే ఆమె కన్సల్టెంట్ సంస్థలను నిర్వహించారని, అలా నిర్వహిస్తూనే అదానీ గ్రూప్ సంస్థలపై దర్యాప్తు చేశారని ఆ హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించింది. ఈ వ్యవహారంపై జేపీసీ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని విపక్షాలు డిమాండ్ చేశాయి.అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధబి ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించాయి. జేపీసీ విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. జేపీసీ విచారణకు ఆదేశించకుంటే.. తాము దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.
అదానీ వ్యవహారంపై సెబీ దర్యాప్తుచేస్తుండగానే ఈ వివరాలు బయటపడ్డాయని.. దీన్ని బట్టి భారీ కుంభకోణం జరిగిందని భావించవచ్చునని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. అదానీ గ్రూపులో రూ.20 వేల కోట్లకు పైగా బినామీ లావాదేవీలు జరిగాయని, విద్యుత్, బొగ్గు పరికరాల్లో అధిక ధరల్లో ఇన్వాయిస్ లు జారీ చేశారని… భారీ ఎత్తున నగదు అక్రమ చలామణీ జరిగిందని ఆయన మండిపడ్డారు. దేశంలోని కీలక మౌలిక రంగాలను అదానీకి అప్పగించారని.. శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో అదానీ వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ వ్యవహరాలను నిర్వహించారని ఆయన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ, జేపీసీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
సెబీ చైర్ పర్సన్ రాజీనామాకు విపక్షాల పట్టు..
‘‘సెబీ చైర్ పర్సన్ ఎందుకు రాజీనామా చేయరు? జేపీసీ విచారణకు ప్రధాని ఎందుకు భయపడుతున్నారు?’’ అని రాహుల్ ప్రశ్నించారు. ఏ నిధులపై విచారణ జరిపించాలో ఆ నిధులనే సెబీ చైర్మన్ పెట్టుబడులుగా పెట్టారని మహువా మొయిత్రా ఆరోపించారు.
ఇది వ్యక్తిత్వ హననమే
హిండన్బర్గ్ నివేదిక, ప్రతిపక్షాల ఆగ్రహం నేపథ్యంలో.. సెబీ చైర్మన్ మాధవికి ..సెబీ, బీజేపీ, అదానీ గ్రూప్ మద్దతుగా నిలిచాయి. ప్రతిపక్షాలు తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని మాధవి బుచ్, ఆమె భర్త ఖండించారు.అదానీ గ్రూప్ పై వచ్చిన అన్ని ఆరోపణలపై తాము విచారణ జరిపించామని.. తన పెట్టుబడుల వివరాలను ఆమె ఎప్పుడూ దాచిపెట్టలేదని, వాటిపై విచారణ జరిగిన సందర్భాల్లో ఆమె విచారణ నుంచి తప్పుకొన్నారని సెబీ వివరణ ఇచ్చింది.మాధవి బుచ్, ఆమె భర్త నిబంధనల ప్రకారమే పెట్టుబడులు పెట్టారని.. అదానీ గ్రూప్ పెట్టుబడుల నిర్ణయాల్లో ఆమె హస్తం లేదని.. మొత్తం తమ పెట్టుబడుల్లో వారి పెట్టుబడులు 1.5 శాతం మాత్రమేనని అదానీ గ్రూప్ తెలిపింది.
దేశంలో పెట్టుబడులను నిలిపివేసేందుకు కాంగ్రెస్ కుట్రకు పాల్పడుతోందని మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.దేశంలో ఆర్థిక అరాచకత్వాన్ని వ్యాపింపజేసేందుకు రాహుల్ ఆధ్వర్యంలో కుట్ర జరుగుతోందన్నారు. హిండెన్ బర్గ్ సంస్థలో ప్రధాన వాటాదారుడైన జార్జ్ సోరోస్ ఏజెంట్గా రాహుల్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.