రగులుతున్న కొరియా ద్వీపకల్పం..
ఉత్తరకొరియా కాలు దువ్వుతోంది. పొరుగున ఉన్న దక్షిణకొరియాపై చెత్త బెలూన్లను ప్రయోగించడం.. ద్వీపకల్పంలో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. తమ భూభాగంలో చెత్త, వ్యర్థాలతో కూడిన వందల బెలూన్లను ఉత్తర కొరియా జారవిడవడాన్ని తీవ్రంగా పరిగణించిన దక్షిణ కొరియా ప్రతిచర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా కిమ్ రాజ్యంతో చేసుకున్న మిలిటరీ ఒప్పందానికి మంగళం పాడనున్నట్లు స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం పునరుద్ధరణ జరిగేవరకు ‘సెప్టెంబర్ 19 మిలటరీ ఒప్పందాన్ని నిలిపివేయాలని కేబినెట్కు చెప్పనున్నట్లు దక్షిణ కొరియా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెల్లడించింది.
వారం రోజులుగా దక్షిణ కొరియా భూభాగంలోకి చెత్త, మురికితో కూడిన వందల సంఖ్యలో బెలూన్లను ఉత్తర కొరియా జారవిడిచింది. ఇప్పటివరకు మొత్తంగా వెయ్యికిపైగా బెలూన్లను వేసినట్లు అంచనా. వీటన్నింటినీ సేకరించిన దక్షిణకొరియా ప్రతినిధులు…తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఉత్తర కొరియా వీటిని పంపించినట్లు సమాచారం. వీటిని ప్రతిచర్యగా పేర్కొన్న కిమ్ సామ్రాజ్యం.. అవసరమైతే మరిన్ని పంపిస్తామని హెచ్చరించింది. పొరుగు దేశ చర్యలపై తీవ్రంగా మండిపడిన దక్షిణ కొరియా.. అవి అసంబద్ధమైన, దిగజారుడు చర్యలని స్పష్టం చేసింది.. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2018లో ఇరుదేశాలు ఓ సైనిక ఒప్పందం చేసుకున్నాయి.
సరిహద్దులో కవ్వింపులు, శత్రుత్వాలు తీవ్రతరం కాకుండా నివారించడం, ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా వీటిపై సంతకాలు చేశాయి. అయితే, గతేడాది ఉ.కొరియా నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సియోల్.. ఈ ఒప్పందాన్ని పాక్షికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తాజాగా దానికి పూర్తి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఉత్తర కొరియా కూడా ఆ ఒప్పందాన్ని తామూ గౌరవించడం లేదని తేల్చి చెప్పింది.






