Dhaka: బంగబంధు ఇంటిపై దాడి.. చరిత్రను మార్చలేరన్న హసీనా..
బంగ్లాదేశ్(Bangladesh) లో పరిస్థితులు అస్థిరంగానే కనిపిస్తున్నాయి. ఓవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా..భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు.. బంగ్లాదేశ్ లో యూనస్ నేతృత్వంలోని తాత్కాలికప్రభుత్వం పాలన సాగిస్తోంది. అయితే పాలన పూర్తిగా యూనస్ సర్కార్ చేతిలో ఉందా..? లేదా ఆయనను ముందుపెట్టి.. అతివాదులు, సైన్యం పరిపాలన సాగిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవలికాలంలో అక్కడ హింసాత్మక కార్యక్రమాలు పెరిగిపోయాయి. వీటి గురించి అక్కడి ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు.
బంగ్లాదేశ్ లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్(Mujibur) రెహమాన్ చారిత్రక నివాసంపై దాడి జరిగింది. కొందరు నిరసనకారులు ఆయన నివాసంపై దాడి చేసి నిప్పంటించారు. ఈ ఇల్లు అధికారవాదం, ఫాసిజానికి చిహ్నమని నిరసనకారులు పేర్కొన్నారు. అంతేకాక.. 1972 నాటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనూహ్యంగా పదవి కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా (Sheikh Hasina) సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆమె ప్రసంగంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి ఆమె పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలోనే ఢాకాలో ఘటనలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఇంటికి నిప్పు పెట్టడంపై సైతం ఆమె స్పందించారు. ‘వారు ఒక భవనాన్ని కూల్చివేయగలరు. కానీ, చరిత్రను కాదు. దీన్ని వారు గుర్తించుకోవాలి’ అని పేర్కొన్నారు. అంతే కాదు తాను బతికి ఉన్నానంటే.. తనతో ప్రజలకు ఏదో పెద్దపని ఉన్నట్లు అర్థం చేసుకోవాలన్నారు.
హసీనా తండ్రి ముజిబర్ రెహమాన్కు బంగబంధుగా పేరుంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత్ సాయంతో పూర్తిచేశారు. అనంతరం 1975లో ఆయన అధికార నివాసంలో ఉండగా సైన్యం దాడి చేసి ఆయనతో సహా ఇంట్లో వారిని చంపేసింది. రెహమాన్తో సహా ఆ కుటుంబంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహనా జర్మనీలో ఉండటంతో బతికిపోయారు. బంగ్లా చరిత్రలో ముజిబుర్ నివాసం ఒక ఐకానిక్ చిహ్నంగా గుర్తింపు పొందింది. అవామీ లీగ్(Awami leguage) పాలనలో దీన్ని మ్యూజియంగా మార్చారు.






