ఉద్యోగులకు జపాన్ బంపరాఫర్..
జపాన్ అభివృద్ధికి మారుపేరు. క్రమశిక్షణకు నిలువుటద్దం.. అణు బాంబుల విధ్వంసంతో కునారిల్లిన దేశాన్ని .. ప్రపంచం ముందట సగర్వంగా నిలబెట్టింది అక్కడి ఉద్యోగులే. నిర్విరామ కృషి, అధునాతన సాంకేతికత మేళవింపుతో నాలెడ్జ్ హబ్ గా దేశాన్ని మార్చారు. అలాంటి జపాన్ లో ఇప్పుడు నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. మరోవైపు ఉన్న ఉద్యోగులపై భారం పెరిగి… అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ రెండింటికీ అక్కడి ప్రభుత్వం ఓ కొత్త పరిష్కారాన్ని ప్రకటించింది.
వారానికి నాలుగురోజులే పని
జపాన్ ప్రభుత్వం కార్మికుల కోసం ఓ వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని పేర్కొంది. ఈవిధానం అన్ని సంస్థల్లో తక్షణమే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నాలుగు రోజుల పని విధానం స్వీకరించడానికి ఎక్కువ మంది ఉద్యోగులు, కంపెనీలు ముందుకు వస్తున్నాయి.2021లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని భావించారు. ఆ సమయంలో చట్టసభ సభ్యులు ఈ ఆలోచనకు ఓకే చెప్పారు. అప్పట్లో ఆ ఆలోచన అత్యధిక ప్రజాదరణ పొందింది. ఇలా చేస్తే అభివృద్ధి విషయంలో కొంత కాలానికి జపాన్ వెనుకపడే ప్రమాదం ఉంటుందని కొన్ని సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
దీని ద్వారా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పించవచ్చని వివరిస్తోంది. ఈ విధానంతో నిరుద్యోగిత రేటు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అంతే కాకుండా తక్కువ పని దినాలు ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా తక్కువ గంటలు, ఇతర సౌకర్యవంతమైన ఏర్పాట్లు, అలాగే ఓవర్టైమ్ పరిమితులకు చెల్లింపు, వార్షిక సెలవులను ప్రవేశపెట్టింది. కార్మిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఉచిత కౌన్సెలింగ్, గ్రాంట్లు, కార్మికుల్లో స్పూర్తిని నింపేందుకు సక్సెస్ స్టోరీలకు సంబంధించిన లైబ్రరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్మికులు వారిపరిస్థితులను బట్టి వివిధ రకాల పని పద్ధతులను ఎంచుకునే అవకాశాలను కల్పించింది.
ఓవర్ టైమ్ వర్క్ తో మరణాలు…
జపాన్లో ఎక్కువశాతం ఉద్యోగస్తులు ఓవర్ టైం డ్యూటీలు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని ఓ నివేదిక వెల్లడించింది. దీనికి తోడు లేబర్ కొరతకు చెక్ చెప్పొచ్చన్నది వారి అభిప్రాయంగా ఉంది. నాలుగు పని దినాల పద్ధతినిప్రస్తుతం టోక్యోలోనిఅకికో యోకోహామా అనే సంస్థ పాటిస్తోంది. దీని ప్రకారం తమ ఉద్యోగులకు శని,ఆదివారాలతో పాటు బుధవారం కూడా సెలవు ఇస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగులు పని ఒత్తిడికి గురి కాకుండా చురుగ్గా పని చేస్తున్నట్లు అక్కడి యాజమాన్యం పేర్కొంది. అంతే కాకుండా తక్కువ పని దినాలు ఉండటంతో ఉద్యోగులు మరింత వేగంగా పనులను పూర్తి చేయగల్గుతున్నారని సంస్థ తెలిపింది.






