దూసుకుపోతున్న ‘భారత్’…
ఆర్థికాభివృద్ధిలో ప్రపంచానికి ఆశాజనకంగా భారత్ మారుతోంది. ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారత్ నిలిచింది. అయితే త్వరలోనే భారత్.. జపాన్ ని సైతం దాటేస్తుందని.. టాప్ 3లో స్థానం దక్కించుకుంటుందని తెలుస్తోంది.ఈ మేరకు ఎస్ అండ్ పీ గ్లోబల్ వివరాలు వెల్లడించింది.
ప్రపంచంలో ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా.. 2030 నాటికి జపాన్ ను దాటేయనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనా వేసింది. ఇందులో భాగంగా… 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని పేర్కొంది.2022లో భారత జీడీపీ 3.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు చేసుకున్న భారత్.. ఈ ఏడాది పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.2 – 6.3 శాతం మేర వృద్ధి చెందొచ్చని అంచనా ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ అండ్ పీ గ్లోబల్ తాజా అంచనాలను వెలువరించింది.
మరో ఏడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఏకంగా 7.3 ట్రిలియన్లకు చేరుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ వెల్లడించింది. ప్రస్తుతం అమెరికా 25.5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంటే… ప్రపంచ జీడీపీలో నాలుగో వంతు వాటా అమెరికాదే . ఇక అగ్రరాజ్యం తర్వాత స్థానంలో 18 ట్రిలియన్ డాలర్లతో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండగా.. 4.2 ట్రిలియన్ డాలర్లతో జపాన్, 4 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో జర్మనీని దాటేస్తుందని తాజా అంచనాలు చెబుతున్నాయి.ఫలితంగా… జపాన్ జీడీపీని దాటేసి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగానూ.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా నిలవనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనా వేసింది.
భారత్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి వివిధ అంశాలు దోహదం చేస్తున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ వెల్లడించింది. దేశంలో మధ్యతరగతి ఆదాయాలు వేగంగా పెరుగుతున్నాయని, ఫలితంగా వినియోగ వస్తువుల వినిమయం పెరగనుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ నివేదిక తెలిపింది. ఫలితంగా… కచ్చితంగా 2030 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని చెబుతోంది.






