భారత్ వెరీ స్మార్ట్ అంటున్న నిక్కీహేలీ..
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ… భారత్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పెద్దన్న పాత్ర పోషించడంపై భారత్ కు విశ్వాసం లేదన్న హేలీ.. ప్రస్తుత పరిస్థితుల్లో భాగస్వామిగా మాత్రం ఉండాలనుకుంటుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల మధ్య భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందన్నారు. అందుకే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోందని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు హేలీ.
2017లో నిక్కీ హేలీ .. యూఎన్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అనేక దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. యూఎస్ విదేశాంగ విధానంపైనా అవగాహన ఉంది. అలాంటి హేలీ.. తాజాగా చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. గతంలో తాను అమెరికా తరపున భారత్ వ్యవహారాలను చూశానని, ప్రధాని మోడీతోనూ మాట్లాడానన్నారు హేలీ. వారు రష్యాతో కాకుండా అమెరికాతో భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం వారికి మన నేతృత్వంపై నమ్మకం లేదు. మనం చాలా బలహీనంగా ఉన్నామనుకుంటున్నారు. భారత్ చాలా స్మార్ట్గా వ్యవహరిస్తోంది. అందుకే వారికి భారీ ఎత్తున సైనిక ఆయుధాలను అందించే రష్యాకు సన్నిహితంగా ఉంటూ వస్తోంది’’ అని హేలీ అన్నారు.
అమెరికా ప్రస్తుతం గల్ఫ్ దేశాలపైనే అధికంగా దృష్టి సారిస్తోందని హేలీ చెప్పారు. అలా కాకుండా ఇతర భాగస్వాములతోనూ సత్సంబంధాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే అమెరికాతో మిత్రదేశాలైన భారత్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణకొరియా, న్యూజిలాండ్ కలిసి వస్తాయని వివరించారు. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు హేలీ. రానురానూ అక్కడి ప్రభుత్వం మరింత నియంతృత్వంగా మారుతోందని విమర్శించారు. గతకొన్నేళ్లుగా వారు అమెరికాతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నారని.. అది వారి తప్పిదమని వ్యాఖ్యానించారు.






