Bejing: భారత్ కు చైనా స్నేహహస్తం వెనక…?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(Trump) ప్రమాణ స్వీకారం తర్వాత తన విధానాల్లో దూకుడు చూపిస్తున్నారు. సుంకాల పేరుతో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో ఏ దేశానికి కూడా ట్రంప్ మినహాయింపు ఇవ్వడం లేదు. వేదికల మీదనే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ట్రంప్ ఆగ్రహానికి గురైన దేశాలలో చైనా కూడా ఒకటి. చైనా(China) మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ.. అంతిమంగా తలవంచక తప్పలేదు. తలొగ్గక తప్పలేదు..
గత కొంతకాలంగా చైనా వస్తువులపై భారత ప్రభుత్వం బ్యాన్ చేయడం, టారిఫ్ లు అధికం చేయడంతో.. ఆదేశం ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితుల్లో చైనా అమెరికా మీద ఎక్కువగా ఆధారపడటం మొదలుపెట్టింది. అమెరికాలోని వస్తు ఉత్పత్తి తగ్గడంతో అనివార్యంగా చైనా మీద ఆధారపడింది. అయితే ఇప్పుడు ట్రంప్ అమెరికా పునర్నిర్మాణం అంటూ హంగామా చేస్తున్న నేపథ్యంలో చైనాకు ఇబ్బందికర వాతావరణ ఏర్పడింది. ఒకవేళ అమెరికాలో తయారీ పరిశ్రమలు మునుపటిలాగా పనిచేస్తే చైనాకు ఇబ్బందులు తప్పవు. పైగా చైనా ఇతర దేశాలకు చేసే ఎగుమతుల మీదే ఆధారపడి ఉంది. అలాంటప్పుడు చైనాకు బలమైన సపోర్ట్ కావాలి. బలమైన దేశం అండగా ఉండాలి. అందుకే డ్రాగన్ వ్యూహం మార్చింది.
భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని..
ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ లను పెంచడంతో చైనాకు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. దీంతో భారత వైపు స్నేహ హస్తాన్ని చాచింది. సహకరించుకుందామంటూ పిలుపునిచ్చింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు..” రెండు దేశాలు పరస్పరం అభివృద్ధి చెందాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. అది ఉమ్మడి లక్ష్యంగా ఉండాలి. పోరాడుతూ ఉండడం కంటే.. పరస్పరం సహకరించుకోవడం ఉత్తమమని” వాంగ్ యీ పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యల పట్ల కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సానుకూలంగా స్పందించారు. ” మా దేశం ఇంకొకరితో శత్రుత్వాన్ని కోరుకోదు. పక్క దేశాన్ని నాశనం చేయాలని అనుకోదు. మాకు కావాల్సింది స్నేహం.. పరస్పర సహకారం.. ఇప్పటికైనా చైనా గుర్తించింది.. దానికి సంతోషమని” జై శంకర్ వ్యాఖ్యానించారు.
మొన్నటివరకు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చైనా చూసింది. గాల్వన్ లోయలో కవ్వింపు చర్యలకు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని గ్రామాలను తన భూభాగంలో ఉన్నట్టు చూపించింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు గ్రామాలను ఆక్రమించడానికి రకరకాల ప్రయత్నాలు ప్రారంభించింది. సరిహద్దు ప్రాంతాల్లో ఏకంగా కొత్త గ్రామాలను సృష్టించింది. అయితే అటువంటి చైనా ఇప్పుడు భారతదేశంలో స్నేహ హస్తాన్ని చాచింది.






