Bangladesh: షేక్ హసీనా ఆస్తుల జప్తు.. మాజీ ప్రధానికి ఎదురుదెబ్బ..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్(Bangladesh)లో ఉన్న హసీనా ఆస్తులతో పాటు ఆమె కుటుంబసభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. బంగ్లాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈక్రమంలో అవినీతి నిరోధక సంఘం (ఏసీసీ) డిప్యూటీ డైరెక్టర్ మోనిరుల్ ఇస్లాం.. హసీనా ఆస్తులు సీజ్ చేసేందుకు ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై మంగళవారం మెట్రోపాలిటన్ సీనియర్ ప్రత్యేక న్యాయమూర్తి జాకీర్ హుస్సేన్ విచారణ జరిపారు. అనంతరం హసీనాకు చెందిన ‘సుధాసదన్’ ఇంటితో సహా ఆమె కుటుంభసభ్యుల ఆస్తులు సీజ్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. హసీనా భర్త, దివంగత అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాకు ‘సుధా మియా’ అనే మరో పేరుంది. దీంతో ఆమె ఇంటికి సుధాసదన్ అని పేరు పెట్టారు.
ఇందులో హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ వుతుల్, సోదరి షేక్ రెహానా, ఆమె కుమార్తెలకు చెందిన ఆస్తులు సైతం ఉన్నాయి. వీరిపై ప్రయాణ నిషేధాన్ని విధించారు. హసీనా, ఆమె కుటుంబసభ్యులకు చెందిన 124 బ్యాంకు ఖాతాల జప్తునకు ఆదేశించింది. వీటిల్లో దాదాపు 600 కోట్ల టాకా (బంగ్లాదేశ్ కరెన్సీ)లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక, హసీనా దేశాన్ని వీడిన అనంతరం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.ఈక్రమంలో హసీనాతో పాటు ఆమె హయాంలోని మాజీ మంత్రులు, సలహాదారులు, పలువురు అధికారులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) అరెస్టు వారెంట్లు జారీ చేసింది. అలాగే ఆమెను అప్పగించాలంటూ అక్కడి తాత్కాలిక ప్రభుత్వం భారత్కు లేఖ రాసింది. అయితే, దీనిపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయలేమని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఇప్పటికే బదులిచ్చారు.






