Prashant Kishor: బిహార్ లో నిరుద్యోగరణం.. పీకే సంఘీభావం

బిహార్ ఎన్నికల ముందు బిహార్ సివిల్ సర్వీసెస్ పరీక్ష(BPSC) సెగలు రేపుతోంది. ఈపరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ బిహార్ లోని నిరుద్యోగ యువత రోడ్డెక్కింది. కొద్దిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోంది.అయితే వీరి ఆందోళనలను బిహార్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈపరిణామాలపై నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందరు అభ్యర్థులకు తిరిగి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.
మరోవైపు…ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్(PK) కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రద్దు చేయ్యాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా ఆయన గురువారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఇటీవల ఇంటిగ్రేటేడ్ కంబైన్డ్ కాంపిటేటివ్( priliminary) ఎగ్జామినేషన్ 2024ను బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(BPSC) నిర్వహించింది. అయితే ఈ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ నిరుద్యోగులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేపట్టారు.
ఆదివారం నిరుద్యోగులు చేపట్టిన ఆందోళనకారులపై వాటర్ కెనాన్స్ ప్రయోగించడంతోపాటు పోలీసులు లాఠీ ఛార్జ్(loti charge) చేశారు. నిరుద్యోగులపై పోలీసులు ఈ విధంగా వ్యవహరించడంతో ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. నిరుద్యోగులకు మద్దతుగా ఆమరణ దీక్షకు దిగారు ప్రశాంత్ కిశోర్.మరోవైపు పాట్నాలోని గాంధీ మైదానంలో విద్యార్థులను నిరసన చేసేందుకు ప్రేరేపించారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్తోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ఆదివారం రాత్రి పోలీసులు నిరుద్యోగులపై లాఠీఛార్జి చేస్తున్న సమయంలో ప్రశాంత్ కిశోర్ అక్కడి నుంచి వెళ్లి పోతున్న వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో అటు విద్యార్థులకు, ఇటు ప్రశాంత్ కిషోర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తమపై పోలీసులు లాఠీఛార్జి చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎందుకు వెళ్లిపోయారంటూ ప్రశాంత్ కిషోర్ని నిరుద్యోగులు సూటిగా ప్రశ్నించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల ఆరోపణలపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. వారి ఆరోపణలను ఆయన ఖండించారు. నిరుద్యోగుల ఉద్యమానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే పోలీసులు లాఠీఛార్జి చేస్తుండడంతో విద్యార్థులను అక్కడి నుంచి వెళ్లాలని సూచిస్తూ.. తాను మరో ప్రదేశానికి వెళ్లానని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు.