PM-KISAN: అనర్హుల నుంచి ఇప్పటికి రూ.416 కోట్లు రికవరీ: కేంద్రం

ప్రతిష్ఠాత్మక పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకంలో అనర్హుల్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు అనర్హుల నుంచి రూ.416 కోట్లు తిరిగి వసూలు చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్సభలో ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆయన.. ఈ వివరాలను వెల్లడించారు. పీఎం-కిసాన్ (PM-KISAN) పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000ను మూడు విడతల్లో కేంద్రం అందిస్తోంది. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 19 విడతల్లో రూ.3.68 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రారంభ దశలో లబ్ధిదారుల నమోదుకు స్వీయ ధ్రువీకరణ పద్ధతిని అనుమతించగా, ఆధార్ సీడింగ్ పూర్తయిన తర్వాత ఆదాయపన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వశాఖల సమాచారంతో అనర్హులను గుర్తిస్తున్నారు.
ఇక అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్యూ కార్మికులు, చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు, ఐటీ చెల్లింపుదారులు ఈ (PM-KISAN) పథకం ప్రయోజనాన్ని పొందితే, వారి నుంచి లబ్ధి పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు పంపినట్లు చౌహాన్ తెలిపారు. అర్హులైన రైతులు ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పీఎం-కిసాన్ (PM-KISAN) అన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకుంటే పథకం లబ్ధి పొందవచ్చని స్పష్టం చేశారు.