పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన కర్ణాటక ప్రభుత్వం!

కర్ణాటక ప్రభుత్వం అక్కడి ప్రజలకు గట్టి షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ఈ పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కూడా తేల్చిచెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో లీటర్ పై రూ.3 రూపాయలు పెంచుతూ కర్ణాటక గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పెట్రోల్పై కర్ణాటక సేల్స్ ట్యాక్స్ (కెఎస్టి) 25.92 శాతం నుండి 29.84 శాతానికి, డీజిల్పై 14.3 శాతం నుండి 18.4 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించింది. ఆలిండియా కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం, లీటర్ పెట్రోల్పై రూ.3, లీటర్ డీజిల్పై రూ.3.02 ధర పెరిగింది. దీంతో బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86కు, డీజిల్ ధర రూ.88.94కు చేరుకుంది. ఈ పెరిగిన ధరలతో రాష్ట్రానికి ఏటా అదనంగా రూ.2,500 నుంచి రూ.2,800 కోట్ల ఆదాయం వస్తుందని తెలుస్తోంది.