పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

దాదాపు దశాబ్దకాలం పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగని కశ్మీర్ లోయలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జమ్మూ కశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. సెప్టెంబరు 18న తొలి విడతలో 24 స్థానాలకు, సెప్టెంబరు 25న రెండో విడతలో 26 స్థానాలకు, అక్టోబరు 1న మూడో విడతలో మిగిలిన 40 స్థానాలకు పోలింగ్ ఉంటుందని తెలిపింది. ఈ ఎన్నికల కౌంటింగ్ అక్టోబరు 4న జరగనుంది. 2019లో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అక్కడ ఎన్నికలు జరగలేదు. అప్పటి నుంచి పలు పార్టీలు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలను కేంద్రం వాయిదా వేస్తూ వచ్చింది. 2014 తర్వాత ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. అటు, హర్యానాలో అక్టోబరు 1న అసెంబ్లీ ఎన్నికలు జరుపనున్నారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా అక్టోబరు 4నే జరగనుంది.