Docking: డాకింగ్ ప్రక్రియ సక్సెస్.. చైనా, రష్యా, అమెరికా సరసన భారత్..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈమేరకు స్పేడెక్స్ (SpaDeX) డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఇస్రో (ISRO) ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.
గత డిసెంబరు 30న షార్ నుంచి పీఎస్ఎల్వీ-సీ60 (పీఎస్ఎల్వీ)లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఎ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ (Docking) కోసం మూడుసార్లు ప్రయత్నించగా.. పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది.చివరకు ఇవాళ వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈక్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ (Docking)ను మొదలుపెట్టారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో (ISRO) తమ పోస్ట్లో రాసుకొచ్చింది. దీనికోసం శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది.
ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈతరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది. డాకింగ్ ప్రక్రియ సక్సెస్ కావడంతో.. భారత అంతరిక్ష పరిజ్ఞానం మరో మెట్టు ఎక్కినట్లైంది. ఎందుకంటే భవిష్యత్తులో గగన్ యాన్(Gaganyaan) అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు సహా .. చాలా ప్రయోగాలకు ఇస్రో సన్నాహకాలు చేస్తోంది. మాటిమాటికి కిందకు వచ్చి ఇంథనం సహా చాలా అంశాల్లో షేరింగ్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని… ఈ డాకింగ్ వల్ల అంతరిక్షం నుంచి కిందకు రాకుండానే.. సమాచారం సహా అన్నింటినీ షేర్ చేసుకునే సామర్థ్యం లభిస్తుంది.
దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు. రాబోయే సంవత్సరాల్లో మన దేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగాలను ఇది కీలక మెట్టుగా నిలిచింది’’ అని ప్రధాని రాసుకొచ్చారు.