కేంద్రం కీలక నిర్ణయం…డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో డిపాజిట్ ఖాతాకు ఇకపై నలుగురు నామినీలను పెట్టుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నామినీల సంఖ్యను పెంచడంతో పాటు బ్యాంకింగ్ చట్టాల్లో అనేక మార్పులను ఆమోదించింది. ఈ చర్యతో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం బ్యాంకులు సేవింగ్, ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం ఒక నామినీనే జత చేసేందుకు అనుమతి ఉంది. కేంద్రం తీసుకురాబోయే మార్పులతో ఈ సంఖ్య నాలుగు వరకు పెరగనుంది. ప్రస్తుతం కేంద్రం నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్( పీపీఎఫ్)కు ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా చేర్చేందుకు వెసులుబాటు ఉంది. కొత్త మార్పులు అమల్లోకి వస్తే యజమాని మరణించిన తర్వాత జాయింట్ ఖాతాదారులకు, వారసులకు డబ్బులు అందించడం సులభంగా మారనుంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో త్వరలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.







