ఆ రాష్ట్రం కీలక నిర్ణయం.. ఎమ్మెల్యేలు పార్టీ మారితే!

పార్టీ ఫిరాయింపులపై హిమాచల్ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ సదుపాయాన్ని నిలిపివేయనుంది. దీనికి సంబంధించిన సవరణ బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది. ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ప్రదేశ్ శాసనసభ ( సభ్యుల పింఛన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు-2024ను రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఓటింగ్ నిర్వహించి ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొన్న శాసనసభ్యులు ఇకపై పింఛను పొందే వెసులుబాటు ఉండదు అని ఈ బిల్లులో పేర్కొన్నారు.