Indian Migrants: భారత్ చేరిన వలసదారుల విమానం.. త్వరలో మరిన్ని తప్పవా?
అమెరికాలో ట్రంప్ కొత్త ప్రభుత్వం.. అక్రమ వలసదారులపై కొరడా ఝుళిపిస్తోంది. అక్రమ వలసదారులపై తన వైఖరిని ఎప్పుడో స్పష్టం చేసేసిన ట్రంప్.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారిని గుర్తించి, అమెరికా నుంచి వారిని వెనక్కు పంపేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే అమెరికాలో కొందరు భారతీయులు (Indian Migrants) కూడా అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించి, వారిని స్వదేశానికి పంపేస్తున్నారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా, చట్టవిరుద్ధంగా తమ దేశంలోకి అడుగుపెట్టిన భారత పౌరులను (Indian Migrants) తిరిగి పంపేయడానికి ప్రత్యేక విమానాన్ని ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం 205 మంది భారతీయులతో టెక్సాస్ నుంచి బయల్దేరిన ఈ అమెరికా ఆర్మీ విమానం సీ-17.. బుధవారం మధ్యాహ్నం అమృత్సర్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండయింది.
ఈ విమానంలో భారత్కు తిరిగి వచ్చిన (Indian Migrants) వారంతా కూడా పంజాబ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలకు చెందినవారేనని తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు వచ్చే అవకాశం ఉందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా, యూఎస్ హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం, అమెరికాలో ఉంటున్న 20,407 మంది భారతీయుల (Indian Migrants) వద్ద సరైన ధ్రువపత్రాలు లేవు. వీరిలో 17,940 మందిని తిరిగి భారత్ పంపేయడానికి ఇప్పటికే ట్రంప్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసేసింది. మరో 2,467 మంది ఈఆర్ఓ (ఎన్ఫోర్స్మెంట్ రిమూవల్ ఆపరేషన్స్) నిర్బంధంలో ఉన్నారు.






