Washington: ఉక్రెయిన్ కు అండగా యూరప్.. మరో 3,350 క్షిపణులు పంపనున్న అమెరికా..
రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధవిరమణకు దిగిరాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్ బి అమల్లోకి తెచ్చారు. యుద్ధంలో ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మరో 3,350 పైగా ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ (ERAM) క్షిపణులను ఆ దేశానికి అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఆమోదం తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆయుధ ప్యాకేజీకి యూరోపియన్ దేశాలు నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపాయి. దాదాపు ఆరు వారాల్లో ఈ క్షిపణులు కీవ్కు చేరుకుంటాయని సమాచారం. అయితే 240 నుంచి 450 కి.మీ పరిధి కలిగిన ఈఆర్ఏఎమ్ క్షిపణులను రష్యాపైకి ప్రయోగించాలంటే ఉక్రెయిన్ పెంటగాన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా అధికారులు చెబుతున్నారు.
మరోవైపు రష్యా భూభాగంలోని లక్ష్యాలను ఛేదించడానికి అమెరికా రూపొందించిన లాంగ్-రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ (ATACMS)ను వినియోగించకుండా పెంటగాన్ అడ్డుకుంటున్నట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. మాస్కో చేపడుతున్న దాడులకు దీటుగా ఆయుధాలను ఉపయోగించకుండా కీవ్ సామర్థ్యాన్ని పరిమితం చేస్తోందని పేర్కొన్నాయి. యుద్ధం ముగింపునకు తాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇరుదేశాల నేతలు ముందడుగు వేస్తుండకపోవడంతో ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో (Russia-Ukraine War) కీవ్కు సహాయంగా అగ్రరాజ్యం పలుమార్లు పెద్ద మొత్తంలో ఆయుధ సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్కు 32.2 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, అత్యాధునిక క్షిపణులు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అమెరికా చట్టసభకు తెలియజేశామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇందులో 15 కోట్ల డాలర్లు అమెరికా ఇప్పటికే అమ్మిన ఆర్మర్డ్ వాహనాల నిర్వహణకు, 17.2 కోట్ల డాలర్లు ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు వినియోగిస్తారు. ఉక్రెయిన్ దారుణమైన దాడులకు గురవుతున్న కారణంగా కీవ్కు మరిన్ని ఆయుధాలు పంపుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి క్షిపణులను అందజేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.







