ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో … శ్రీజేశ్కు మరో అరుదైన అవకాశం
ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో పతాకధారిగా భారత యువ షూటర్ మను బాకర్కు ఛాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ హాకీ గోల్కీపర్ శ్రీజేశ్కు కూడా ఈ అవకాశం దక్కింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. క్రీడాకారుల అభీష్టం మేరకు శ్రీజేశ్ను కూడా పతాకధారిగా ఎంపిక చేసినట్లు ఐఓఏ అద్యక్షురాలు పీటీ ఉష వెల్లడించారు. శ్రీజేశ్ గత రెండు దశాబ్దాలకుపైగా భారత్ క్రీడలకు, హాకీకి అద్భుతమైన సేవలందించారన్నారు. జావెలిన్ త్రోలో రజతం సాధించిన నీరజ్ చోప్రాతో తాను మాట్లాడానని, ముగింపు వేడుకల్లో శ్రీజేశ్ పతాకధారిగా ఉండేందుకు అతడు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. మీరు నన్ను అడగకపోయినా నేను శ్రీ భాయ్ పేరు సూచిస్తాను అని నీరజ్ పేర్కొన్నట్లు ఉష తెలిపారు.






