Iran: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీకి ఇజ్రాయెల్ డైరెక్ట్ వార్నింగ్..

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న భీకర యుద్ధంతో పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారింది. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి ఇరుదేశాలు పరస్పర దాడులకు దిగాయి. ఈక్రమంలో సాక్షాత్తూ ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) నివాస సమీపంలోనూ వైమానిక దాడులు జరిగినట్లు తెలుస్తోంది.టెహ్రాన్లోని మోనిరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. అక్కడే ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉంది. ఈ క్రమంలోనే అక్కడ దాడులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీ..
ఇరాన్ మిలిటరీ చీఫ్గా అమీర్ హతామీని నియమించినట్లు ఖమేనీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ (Israel) జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరి మృతిచెందిన విషయం తెలిసిందే. 2013 నుంచి 2023 వరకు హతామీ దేశ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో గురువారం అర్ధరాత్రి నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు దిగింది. ఇరాన్లోని అణు, సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులే లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో టెహ్రాన్ పలు కీలకమైన మిలిటరీ అధికారులను, అణుశాస్ర్తవేత్తలను కోల్పోయింది. దీనికి టెహ్రాన్ ప్రతిదాడులను కూడా చేసింది. టెల్అవీవ్ చేసిన దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా.. 329 మంది గాయపడ్డారు.