మైక్ పెన్స్ సిబ్బందిలో ఒకరికి కరోనా!
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్షుడికి మీడియా ప్రతినిధిగా వ్వవహరిస్తున్న కేటీ మిల్లర్ అపూ మహిళరే కరోనా సోకింది. ఈమె అధ్యక్షుడు ట్రంప్ ముఖ్య ఉద్యోగి స్టీఫెన్ మిల్లర్ సతీమణి. తాజా ఘటనతో శ్వేతసౌధంలో కరోనా బాధితుల సంఖ్య రెండుకు చేరింది. విధి నిర్వహణలో భాగంగా కేటీ మిల్లర్ వైట్హౌస్లో నిర్వహించిన అనేక కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. గురువారం కూడా ఆమె పాల్గొన్న ఓ బహిరంగ ప్రార్థనా సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడి భార్యతో సహా పదుల సంఖ్యలో ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్, పెన్స్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిద్దరికీ నెగిటివ్ అని తేలింది. ఇకనుంచి వారిరువురికీ ప్రతిరోజూ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే అధ్యక్షుడి భద్రత విషయమై ఆందోళన చెందనవసరం లేదని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు.






