ఘనంగా జరిగిన ‘వాగ్గేయకార వైభవం’

భారతీయ సంగీత చరిత్రలో మొదటి సారిగా ప్రముఖ తెలుగు వాగ్గేయకారుల రచనలతో పాటు, చరిత్రకందని తెలుగు వాగ్గేయకారుల రచనలతో ”తెలుగు వాగ్గేయ వైభవం” అనే బహత్తర కార్యక్రమాన్ని బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) సహకారంతో ”స్వరవేదిక” సంస్ధ నిర్వహించింది. , సుప్రసిద్ధ కర్ణాటక సంగీత కళాకారుడు డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మిల్పిటాస్లోని జైన్ మందిరంలో జూలై 28న అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు గంటలు పాటు సాగిన ఈ కార్యక్రమంలో అమెరికాలోని 10 రాష్ట్రాల నుండి వచ్చిన 40 మంది ప్రవాసాంధ్ర చిన్నారులు సుమారు 25 వాగ్గేయకారుల కీర్తనలను ఆలపించారు.
ఈ కార్యక్రమానికి క్యూపర్టినో కౌన్సిల్ సభ్యులు, మాజీ మేయర్. సవితా వైద్యనాధన్ ముఖ్య అతిధిగా వచ్చారు. వాగ్గేయకారులపై విశేషమైన పరిశోధనలు చేసిన డా. వైజర్సు గారు రచించిన ”అజ్ఞాత వాగ్గేయకారుల” పుస్తకాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు. డా. బాలసుబ్రహ్మణ్యంకు క్యూపర్టినో నగర ప్రశంసా పత్రాన్ని కూడా అందజేశారు. బే ఏరియా తెలుగు అసొసియేషన్ ,”స్వరవేదిక” సంస్ధ సంయుక్తంగా, డా. వైజర్సు బాలసుబ్రహ్మణ్యంకు ‘వాగ్గేయ వరప్రసాది’ బిరుదును ప్రదానం చేసింది. బాటా నాయకులు విజయ ఆసూరి, ప్రసాద్ మంగిన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.