పాక్ లో క్వారంటైన్ సమయం 48 గంటలేనట!
పాక్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య వేలల్లో ఉండటంతోపాటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ఈ వైరస్ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదంతో అల్లాడుతున్న ఆ దేశం కరోనా దెబ్బకు మరింత కుదేలైంది. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న ఇమ్రాన్ సర్కార్ కు కరోనా గుదిబండలా మారింది. సరైన మెడికల్ వ్యవస్థ లేదు. పీపీఈ కిట్లను అందించే స్థోమత ఉండటం లేదు. ఏం చేయాలో పాలుపోని పాక్ కు ఇప్పటికే ఇండియా కొన్ని రకాల మెడిసిన్స్ ను సప్లై చేసింది. మెడిసిన్ తయారు చేసుకునే ముడి పదార్దాలను ఇండియా ఆ దేశానికీ ఎగుమతి చేస్తున్నది. పుల్వమా దాడి తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
దీంతో ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై నిషేధం విధించింది పాక్. దీంతో ఆ దేశంలో మందుల కొరత రావడంతో మెడిసిన్స్ విషయంలో సడలింపులు ఇచ్చి దిగుమతి చేసుకుంటోంది. ఇదిలా ఉంటె, అన్ని దేశాల్లో క్వారంటైన్ కు పంపించే వ్యక్తుల సంఖ్య కనీసం 14 నుంచి 28 రోజుల వరకు ఉంటుంది. కానీ, పాక్ మాత్రం దానిని పక్కన పెట్టి క్వారంటైన్ సమయం కేవలం 48 గంటలు మాత్రమే గా నిర్ణయించింది. 48 గంటల తరువాత మెడికల్ టెస్టుల్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్ కు పంపుతారు. లేదంటే ఇంటికి పంపుతారు. 14 రోజులుంటేనే కరోనా వైరస్ బయటపడటం లేదు. మరి కేవలం 48 గంటలు మాత్రమే క్వారంటైన్ అంటే ఎలా? 48 గంటల్లో కరోనా లక్షణాలు ఎలా బయటపడతాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.






