US: అమెరికా చదువులకు దూరమవుతున్న భారతీయ విద్యార్థులు..!
ట్రంప్ సర్కార్ ఆంక్షలు, వీసా రుసుము భారీగా పెంచడంతో.. విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువులకు దూరమవుతున్నారు.2024-25 విద్యా సంవత్సరంలో భారత విద్యార్థుల గ్రాడ్యుయేట్ ప్రవేశాలు 10 శాతం మేర తగ్గాయని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నిధులతో రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసిన “ఓపెన్ డోర్స్” నివేదిక ప్రకారం 2025 ఫాల్ సెషన్లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాలు ఏకంగా 17 శాతం తగ్గాయి.
సర్వేలో పాల్గొన్న 825 అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో 61 శాతానికి పైగా సంస్థలు భారత విద్యార్థుల నమోదులో క్షీణత కనిపించిందని తెలిపాయి. వీసా దరఖాస్తుల విషయంలో ఎదురవుతున్న సమస్యలు, ప్రయాణ ఆంక్షలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని 96 శాతం యూనివర్సిటీలు అభిప్రాయపడ్డాయి. అయితే, 2024-25లో అమెరికాకు అత్యధిక విదేశీ విద్యార్థులను పంపిన దేశంగా భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం విద్యార్థుల సంఖ్యలో 10 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ, గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మాత్రం క్షీణత నమోదైంది.
మరోవైపు, రిపబ్లికన్ చట్టసభ సభ్యులు హెచ్-1బీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను స్టేట్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయ విద్యార్థులు ఏటా దాదాపు 55 బిలియన్ డాలర్లను అందిస్తూ, 3.55 లక్షల ఉద్యోగాలకు మద్దతుగా నిలుస్తున్నారని వాణిజ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా పరిణామాలు ఈ ఆర్థిక వనరులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.






