Delhi: బంగారు కొండగా భారత్…
ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకోవడం, అస్థిర పరిస్థితులతో భారత్ ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్ పెంచింది. దీనిలో భాగంగా బంగారం దిగుమతులపై ఫోకస్ పెంచింది. ఎందుకంటే .. పరిస్థితులు విషమిస్తే, ఆయా దేశాల్లో ఉన్న బంగారాన్ని.. సదరు దేశాలు స్తంభింపచేసే ప్రమాదముంది. అలాంటప్పుడు… భారత్ ఇబ్బందుల పాలవుతుంది. అందుకే ఇన్నాళ్లు.. వివిధ దేశాల్లో బంగారాన్ని నిల్వచేసిన భారత్.. ఇప్పుడు వాటిని తిరిగి సురక్షితంగా వెనక్కు తెప్పిస్తోంది.
దేశంలో బంగారం దిగుమతులు అక్టోబరు నెలలో సరికొత్త రికార్డు సృష్టించాయి. గతేడాదితో పోలిస్తే ఏకంగా మూడింతలు పెరిగి 1,472 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1,30,404 కోట్లు) చేరాయి. 2024 అక్టోబరులో ఇవి కేవలం 492 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం గిరాకీ అనూహ్యంగా పెరగడమే ఇందుకు కారణమని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 5 శాతాన్ని దాటింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్-అక్టోబరు మధ్య ఏడు నెలల్లో పసిడి దిగుమతుల విలువ 21.44 శాతం పెరిగి 4,123 కోట్ల డాలర్లకు (రూ.3.65 లక్షల కోట్లు) చేరింది. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.1.30 లక్షలకు చేరువలో ఉన్నప్పటికీ, కొనుగోళ్లు తగ్గకపోవడం గమనార్హం. ఇదే సమయంలో వెండి దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. అక్టోబరులో వెండి దిగుమతులు 528.71 శాతం వృద్ధితో 271 కోట్ల డాలర్లుగా (రూ.24,007 కోట్లు) నమోదయ్యాయి.
అక్టోబరులో దిగుమతి చేసుకున్న మొత్తం పసిడిలో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచే వస్తోంది. ఆ తర్వాత యూఏఈ (16 శాతం), దక్షిణాఫ్రికా (10 శాతం) ఉన్నాయి. మరోవైపు, అమెరికాకు భారత ఎగుమతులు వరుసగా రెండో నెలా తగ్గుముఖం పట్టాయి. అక్టోబరులో 8.58 శాతం క్షీణించి 630 కోట్ల డాలర్లకు పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల ప్రభావమే ఇందుకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.






