ప్రపంచంలోనే అత్యధికం.. భారీగా ప్రవాసుల కాసులు
భారత్లోకి ప్రవాసులు పంపే నగదు (రెమిటెన్స్) భారీ స్థాయిలో ఉంటోందని సింగపూర్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్స్టారెమ్ తెలిపింది. గతేడాది ఈ విధంగా వచ్చిన 82 బిలియన్ డాలర్ల (సుమారు రూ.6.72 లక్షల కోట్ల)తో పోలిస్తే ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8.2 లక్షల కోట్ల)కు చేరే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనాలను ఉటంకించింది. గతేడాది నమోదైన 82 బి.డాలర్లు ఇప్పటిదాకా ఏ దేశానికైనా ప్రవాసులు నుంచి వచ్చిన అత్యధిక మొత్తం కావడం గమనార్హం. భారత్కు మాకు అతిపెద్ద మార్కెట్. ముంబయిలో మాకు భారీ స్థాయిలో కార్యకలాపాలున్నాయని ఇన్స్టారెమ్ గ్లోబల్ హెడ్ యోగేవ్ సంగల్ పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నైల్లోనూ ఆఫీసులు తెరచినట్లు తెలిపారు. రెమినెట్స్ మార్కెట్లో చాలా కంపెనీలకు అవకాశాలున్నాయి. అగ్రగామి 5 కంపెనీలు 15 శాతం మార్కెట్ వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. కాబట్టి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. అంతర్జాతీయంగా 682 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ మార్కెట్ ఉందని పేర్కొన్నారు.






