కీలక పదవిలో మరో తెలుగు తేజం

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో కీలక పదవికి మరో తెలుగు తేజం ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లకు చెందిన రామ మోహన రావు అమర బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ), ఆర్థిక సంస్థల కీలక పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసే ది ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి రామ మోహన రావు పేరును ఎంపిక చేసింది. ఈ సిఫారసును కేంద్ర క్యాబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎస్బీఐ ఎండీగా ఉన్న మరో తెలుగు తేజం సీ శ్రీనివాసులు శెట్టి ఇటీవల ఎస్బీఐ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో రామ మోహన రావు బ్యాంక్ ఎండీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.