ఎయిరిండియాలో కొత్త ఫీచర్.. టికెట్ బుకింగ్ కోసం కొత్త టెక్నాలజీ

ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా సిద్ధమైంది. టికెట్ బుకింగ్ విధానాన్ని మరింత సులభతరం చేయడం కోసం కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (ఐఏటీఏ) సాయంతో న్యూ డిస్ట్రిబ్యూషన్ కెపాసిటీ (ఎన్డీసీ) సాంకేతికతను పరిచయం చేస్తున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్డీసీ టెక్నాలజీతో టికెట్ బుకింగ్ సేవలను తీసుకొచ్చిన తొలి విమానయాన సంస్థగా ఎయిరిండియా అవతరించింది.
ఆఫర్లు, డీల్స్, యాడ్`ఆన్లు, అనుకూలమైన ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇకపై బుకింగ్ సమయంలోనే దర్శనమిస్తాయి. దీంతో ఆఫర్ల కోసం ప్రత్యేకంగా సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు. బుకింగ్ మరింత పారదర్శకంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ గురించి మరిన్ని విషయాలు కంపెనీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఎయిర్లైన్స్ తెలిపింది. లేదా ఎన్డీసీ కస్టమర్ సపోర్ట్ సాయంతో వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.