Washington: టార్గెట్ వెనుజులా .. కరేబియన్ సముద్రంలోకి అమెరికా దళాలు..

ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెనెజులాపై అమెరికా కన్నేసిందా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఆదేశం నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న అమెరికా.. ఇప్పుడా దేశాన్ని సొంతం చేసుకుంటే ఎలా ఉంటుందా అన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (USA President Donald Trump) కరేబియన్ సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక ఫైటర్జెట్లను మోహరించారు. దీంతో కరేబియన్ జలాలపై యుద్ధమేఘాలు కమ్ముకొన్నాయి. ఏ క్షణమైనా అమెరికా (USA) దళాలు వెనుజువెలా (Venezuela) లో చొరబడొచ్చని ప్రచారం జరుగుతోంది.
వెనుజువెలా (venezuela) ముఠాల నుంచి మాదకద్రవ్యాలు అమెరికాను (USA) ముంచెత్తుతున్నాయని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారు. తాజాగా ఆ ముఠాలను అంతం చేసేందుకు సైనికదళాలను రంగంలోకి దింపారు. ఈ ముఠాలతో వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ట్రంప్ కార్యవర్గం ఇప్పటికే తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన్ను పట్టించే సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.430 కోట్లు) బహుమతి ప్రకటించింది. మదురో సర్కారు ఇక రోజులు లెక్కపెట్టుకోవాలని ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో హెచ్చరించారు. మదురో ఎన్నికను అమెరికా గుర్తించడంలేదని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవెట్టి వెల్లడించారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం కూడా ట్రంప్ కార్యవర్గానికి ఉన్నట్లు తెలుస్తోంది.
కేవలం మాదకద్రవ్యాల ముఠాల కోసం యుద్ధం స్థాయిలో అమెరికా (USA) బలగాలను మోహరించింది. మొత్తం ఎనిమిది వార్షిప్లను అక్కడకు పంపింది. ది ఇవో జిమా యాంఫిబియస్ రెడీగ్రూప్లోని యూఎస్ఎస్ శాన్ ఆంటోనియో, యూఎస్ఎస్ ఇవో జిమా, యూఎస్ఎస్ ఫోర్ట్ లాడర్డేల్ నౌకలు 4,500 మంది సైనికులతో కరేబియన్ సముద్రంలోకి వెళ్లాయి. 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2,200 మంది వీరిలో ఉన్నారు. ఏవీ-8బీ హారియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్లైన యూఎస్ఎస్ జాన్సన్ డున్హమ్, యూఎస్ఎస్ గ్రేవ్లీ దక్షిణ కరేబియన్లో మోహరించాయి. తూర్పు పసిఫిక్లో యూఎస్ఎస్ శాంప్సన్ త్వరలో వచ్చి చేరనుంది. ఒక్కో డెస్ట్రాయర్లో 90 క్షిపణులు ఉంటాయి. గైడెడ్ మిసైల్ క్రూయిజర్ యూఎస్ఎస్ లేక్ ఎరి, మిన్నియాపోలీస్ సెయింట్ పాల్ కూడా వెనుజువెలాపై గురిపెట్టి ఉన్నాయి. శుక్రవారం రాత్రి 10 ఎఫ్-35 ఫైటర్ జెట్లను ప్యూర్టోరికోలో మోహరించింది. పెద్ద సంఖ్యలో పీ-8 నిఘా విమానాలను రంగంలోకి దించింది.
ఇటీవలే డ్రగ్స్ బోటు అంటూ ఓ పడవను అమెరికా (USA) దళాలు ముంచేశాయి. దీంతో 11 మంది మరణించారు. అమెరికా మోహరింపులను మదురో తప్పుపట్టారు. గత 100 ఏళ్లలో తమ దేశం ఎదుర్కొన్న అతిపెద్ద ముప్పుగా దానిని వర్ణించారు. 8 నౌకల్లో 1200 క్షిపణులను తమపై గురిపెట్టారని ఆరోపించారు.
ఎప్పటి నుంచో ట్రంప్ కన్ను..
ట్రంప్ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ‘వెనుజులాలో చమురు రిజర్వులను అమెరికా స్వాధీనం చేసుకోవాలి’అని అన్నారు. 2017లో ఓ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుజువెలాపై ఎందుకు యుద్ధం చేయడంలేదని ప్రశ్నించారు. ‘‘వాళ్ల వద్ద చాలా చమురు ఉంది. భౌగోళికంగా మనకు చాలా దగ్గర’’ అని వ్యాఖ్యానించారు. గతంలో కూడా మదురో సర్కారును కూల్చేందుకు ట్రంప్ ప్రయత్నించారు.