తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి…

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఎలక్ట్రానిక్ వాహన రంగంలో రూ.2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ట్రైటాన్ ఈవీ ముందుకు వచ్చింది. జహీరాబాద్ నిమ్జ్ లో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ట్రైటాన్ ఈవీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో ట్రైటాన్ ఈవీ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను ట్రైటాన్ ఈవీ ప్రతినిధులు కలిసి తమ పెట్టుబడి ప్రణాళికను వివరించారు. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్కు కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ తెలిపారు.
తమ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ మేరకు జహీరాబాద్ నిమ్జ్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నమని హిమాన్షు పటేల్ స్పష్టం చేశారు.
ఈ యూనిట్ ఏర్పాటైతే 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తొలి ఐదేళ్లలో 50 వేల వాహనాలు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైటాన్ ఈవీ సంస్థకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడితో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం క్రమంగా ఈవీ రంగ పెట్టుబడులకు ఒక అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారుతుందని ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొంది.