Revanth Reddy: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

పెండింగ్ లో ఉన్న రైలు ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చటంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలని దూరాభారం తగ్గించి, అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించటంతో పాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు.
రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో పాటు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమావేశానికి హాజరైన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను ముఖ్యమంత్రి స్వాగతించారు. కొత్త ప్రాజెక్టులపై ఆయనతో ప్రత్యేకంగా చర్చించారు. సీఎంతో పాటు ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రెటరీ వికాసరాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందన్నారు.
కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందన్నారు.
దానికి అనుగుణంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే విభాగం పరిశీలనలో ఉన్న అలైన్మెంట్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ను పరిశీలించి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు. హైవే వెంట రైలుమార్గం ఉండాలని, హైవేకు ఇరువైపులా కిలోమీటర్న్నర దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయని చెప్పారు.
కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగుళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచించారు.
హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను ముఖ్యమంత్రి అధికారులకు వివరించారు. దాదాపు 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటు చేయటంతో హైదరాబాద్ మహా నగరం భవిష్యత్తు స్వరూపం మారిపోతుందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సీఎం సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.
వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో పాటు గద్వాల–డోర్నకల్ రైల్వే లైన్ పనుల డీపీఆర్ పూర్తి చేసి వేగంగా చేపట్టాలన్నారు.
వరంగల్లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని సూచించారు. కాజీపేట జంక్షన్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ తో పాటు వరంగల్ ను అభివృద్ధి చేయాలని, అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని ముఖ్యమంత్రి రైల్వే అధికారులకు సూచించారు.