రాష్ట్రంలో పెట్టుబడులకు రైన్లాండ్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి చూపిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రైన్లాండ్ ఆర్థిక, రవాణా, వ్యవసాయ శాఖల మంత్రి డానియేలా ష్మిట్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయింది. ఈ సందర్భంగా రసాయనాలు, ఫార్మా ఉత్పత్తులు, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్లు, ప్యాకేజింగ్, పౌల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ తదితర విభాగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సులభతర వాణిజ్య విధానాలు, తక్షణ అనుమతుల జారీలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మాలో పెట్టుబడులకు ప్రపంచంలో తెలంగాణ గమ్యస్థానంగా ఉందని తెలిపారు. హైదరాబాద్లో జరిగే బయో ఆసియా 2025 సదస్సుకు హాజరు కావాలని రైన్లాండ్ ప్రతినిధులను మంత్రి కోరారు. తెలంగాణ, రైన్ లాండ్ రాష్ట్రాలు సిస్టర్ స్టేట్ సంబంధాలు కలిగి ఉండాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో చెన్నైలోని జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేలా కుష్లర్, హైదరాబాద్ గౌరవ కాన్సుల్ అమితా దేశాయ్తో పాటు, టీజీఐఐసీ ఎండీ విష్నువర్ధన్రెడ్డి, రాష్ట్ర లైఫ్ సైన్సెస్ విభాగం సీఈవో శక్తి నాగప్పన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.