Davos: సీఎం రేవంత్ను కలిసిన మంత్రి లోకేశ్
దావోస్లోవరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పరస్పర గౌరవ సూచకంగా సీఎం రేవంత్ రెడ్డిని లోకేశ్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా టాటా సంస్థ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఐటీఐలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, స్కిల్ క్యాంపస్ లుగా తీర్చిదిద్దిన ఐటీఐలను సందర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని సీఎం చెప్పారు. పెట్టుబడుల సాధనలో పోటీపడి దేశానికే తెలుగురాష్ట్రాలు ఆదర్శంగా నిలవనున్నాయని సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి నారా లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు కోట్లాది మంది భక్తులు దర్శించుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ దేవస్థానాన్ని వందల కోట్ల రూపాయలతో ఆధునికీకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం చూపని చొరవతో రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, తప్పకుండా వనదేవతలను దర్శించుకోవాలని మంత్రి లోకేశ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగతిని లోకేశ్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి ద్వారా వస్తున్న సానుకూల ఫలితాల గురించి చర్చించారు. పెట్టుబడుల సాధనలో తెలుగు రాష్ట్రాలు పరస్పరం పోటీపడుతూనే, అభివృద్ధి విషయంలో సహకరించుకోవాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తితో ముందుకెళితే దేశానికే తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.






