Seethakka: అబద్ధాలకు అంబాసిడర్ కేటీఆర్ : మంత్రి సీతక్క

మాజీ మంత్రి కేటీఆర్ గొప్ప లీడర్ కాదు, తప్పు లీడర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) విమర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలకు అంబాసిడర్ కేటీఆర్ (KTR) అని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ (Jubilee Hills) లో దొంగ ఓట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2023 ఎన్నికల్లో కూడా ఆ ఓట్లు ఉన్నాయని ఆమె తెలిపారు. అవి దొంగ ఓట్లయితే దానికి కారణం మీరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నచ్చని ఓట్లను తీసేసిన చరిత్ర బీఆర్ఎస్ (BRS) ది అని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన ఘనులు బీఆర్ఎస్ నేతలు అని విమర్శించారు. ప్రస్తుతం కారు (Car) కు పంక్చర్ అయింది. పనికి రాకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నది కాంగ్రెస్. ఇళ్లు ఇస్తామని మోసం చేసింది బీఆర్ఎస్ అని అన్నారు. బీసీ జీవో ఆగినందుకు బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు మానుకోండి. మంత్రులం అందరం కలిసే ఉన్నామని స్పష్టం చేశారు.