Revanth Reddy: రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మిస్తే.. అది మూడేళ్లకే కూలిపోయింది : సీఎం రేవంత్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ రూ.8.15 లక్షల కోట్ల అప్పు చేసి పదవి దిగి వెళ్లిపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన మే డే వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయో ఆనవాళ్లు తెలియడం లేదన్నారు. కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలు చెల్లించేందుకే రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మిస్తే. ఆది మూడేళ్లకే కూలిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 గ్యాస్ సిలిండర్ను రూ.500కే ఇస్తున్నాం. తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తి చేశాం. నూతన రాష్ట్రం ఏర్పాటైన నాటికి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రూ.8.15 లక్షల కోట్ల అప్పులోకి ఎందుకు పోయింది? రాష్ట్రం అప్పులపాలయితే కేసీఆర్ కుటుంబానికి పత్రికలు ఛానెళ్లు (channels) , ఫామ్హౌస్ (farmhouse )లు ఎలా వచ్చాయి? కనీసం ధర్నా చౌక్ (Dharna Chowk ) లో నిరసన తెలిపే హక్కు లేకుండా దాన్ని మూసివేశారు. ప్రస్తుతం పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా మన కోర్సులు లేవు. వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలని నిర్ణయించాం. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం అని తెలిపారు.
ప్రభుత్వానికి ప్రతినెలా రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కిస్తీలకు రూ.6 వేల కోట్లు పోతోంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతభత్యాలకే రూ.6 వేల కోట్లు పోతోంది. ప్రతి నెలా రూ.22 వేల కోట్లు వస్తే తప్ప ప్రభుత్వ కనీస అవసరాలు తీరవు. సర్పంచ్లకు బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయిందే. ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగోలుగా అప్పులు తెచ్చారు. ఆర్థికంగా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, కొత్త డిమాండ్లు చేస్తే ఎలా? ఏమైనా సమస్యలుంటే కూర్చొని పరిస్కరించుకుందాం. ఉట్టి తెగిపడాలని మాజీ సీఎం రోజూ శాపనార్థాలు పెడుతున్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని మాజీ సీఎం గుర్తుంచుకోవాలి. కపట నాటక సూత్రధారి మళ్లీ బయటకు వచ్చాడు. నమ్మి మోసపోవద్దు అని అన్నారు.