Hydra: హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్…

హైడ్రా విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ (Hydra Police Station) ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసింది. 1908 లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిజాం నిర్మించారు. మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చాం. బెంగుళూరులో చెరువులను పరిరక్షించుకోకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతున్న పరిస్థితి. కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో ఢిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితి.
మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి. ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అందుకే ఎవరేం అనుకున్నా హైడ్రాను తీసుకొచ్చాం. చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదు. హైదరాబాద్ (Hyderabad) లో చిన్న వర్షం వస్తే కాలనీలకు కాలనీలే మునిగిపోతున్నాయి.
హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు… రోడ్డుపై నీరు నిలవకుండా, విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా, వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యతను హైడ్రా చూసుకుంటోంది. నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి. కొందరు రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం లేదా? నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేద్దామా? అందుకే హైడ్రాను ఏర్పాటు చేసుకున్నాం.
హైడ్రా ద్వారా చెరువులను కాపాడి వాటిని పునరుద్ధరిస్తున్నాం. చెరువులను , నాలాలను, మూసీని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపం. అలాంటి కొంతమంది మా నిర్ణయాలను వ్యతిరేకించినా… ప్రజలకోసం మేం వెనక్కి తగ్గేది లేదు. పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధైతుంది… ప్రకృతిని కాపాడుతామంటే కొందరికి దుఃఖం వస్తుంది… ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందని మాట్లాడుతున్నారు. అసలు మీ బాధ ఎంది? వాళ్ళు కడుపు నిండా విషం నింపుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు.. ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారు..
గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా నది, ఢిల్లీలో యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ మేం మూసీని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారు. బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా…? నాపై కక్ష ఉంటే నాపై చూపండి.. ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దు.. వారసత్వ సంపదను కాపాడుకుని నగరాన్ని పునరుద్ధరించుకుందాం.. హైడ్రా అధికారులకు నా సూచన.. పేదల పట్ల మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించండి.. పేదలకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించండి.