ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదు : సీఎం రేవంత్

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అప్పులు లెక్కలు చెప్పిన హరీశ్రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదు. బీఆర్ఎస్ హయాంలో రూ.లక్షల కోట్ల విలువైన ఓఆర్ఆర్ను రూ.7 వేల కోట్లకు అమ్మారు. పదేళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి భూములు అమ్ముకున్నారు. కానీ జిల్లాకు సాగునీరు ఇవ్వలేదు. ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా? సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత నాకుంది. సభలో అబద్ధాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. 2018 డిసెంబర్ లోపే విద్యుత్ మీటర్లు బిగిస్తామని కేంద్రానికి కేసీఆర్ చెప్పారు. అధికారిక లెక్కలు చూసి హరీశ్రావు స్పందించాలి అని తెలిపారు.