High Court: హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు (High Court) లో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు (Kasam Venkateswarlu) పరువు నష్టం దావా వేశారు. బీజేపీకి పరువు నష్టం కలిగేలా రేవంత్ రెడ్డి మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు. కాసం పిటిషన్ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది.
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పారని కాసం తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రసంగం ఆడియో(Audio), వీడియో క్లిప్పింగ్ (video clipping) లను సైతం కాసం కోర్టుకు సమర్పించారు. దీంతో విచారణలో ఉన్న ఈకేసును కొట్టేయాలని రేవంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే, కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.