Ramachandra Rao: బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం : రాంచందర్రావు
కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్లు లక్ష్యంగా పెట్టుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు (Ramachandra Rao) అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ రెండు పార్టీలూ కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయే తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం చేస్తున్నాయో మాత్రం చెప్పడంలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల (Projects) పేరిట లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేసుకుంటున్న ఆ పార్టీల నాయకులు చిత్తశుద్ధి ఉంటే ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇచ్చారో స్పష్టం చేయాలని సవాల్ చేశారు. గత 12 ఏళ్లలో ఏ రైతుకి ప్రయోజనం కలిగిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ ప్రభుత్వాలు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి బదులు పెండింగ్లో ఉన్నవాటిని పూర్తిచేసి ఉంటే లక్షల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తెలంగాణను మోసం చేశాయని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తోందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయలేదని, చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపించారు. ఆ రెండు ప్రభుత్వాలు పెద్ద ప్రాజెక్టులకే ఎందుకు ప్రాధాన్యమిస్తున్నాయో అందరికీ తెలుసన్నారు.






