తెలంగాణకు శుభవార్త
తెలంగాణకు మరో శుభవార్త. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఉపాధి లేక వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా తెలంగాణలో ఉపాధి కోసం వలస కూలీలు రాష్ట్రానికి తిరిగి వస్తున్నారు. అందులో భాగంగా తొలి విడతగా బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుంచి ప్రత్యేక శ్రామిక్ ఎక్సప్రెస్ రైలులో 225 మంది వలస కూలీలు లింగంపల్లి స్టేషన్కు చేరుకున్నారు. తిరిగి వచ్చిన వలస కూలీలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతు బంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పూలతో స్వాగతం పలికారు. హైదరాబాద్కు వచ్చిన కూలీలు ప్రధానంగా రైస్ మిల్లులతో పనిచేయడానికి వచ్చారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వలస కూలీల రాకను రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు.






